18-06-2025 07:59:38 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయాలు ఎలా ఉన్న రైతుల విషయంలో రాజీ పడేది లేదన్నారు. గోదావరి-బనకచర్లపై ఎలా ముందుకెళ్లాలో విపక్షాలతోనూ చర్చించామని, 21.09.2016 నాడు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని సీఎం చెప్పారు. ఏటా 3 వేల టీఎంసీలు గోదావరిలో వృథాగా కలుస్తున్నాయని మొదట మాట్లాడింది ఆనాటి కేసీఆర్ అన్నారని, కానీ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆలోచనకు ఆనాడే బీజం పడిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
2019 అక్టోబర్ లో కేసీఆర్, జగన్ సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని తెలిపారు. సీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ అన్నారని, అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల్లో ఉందని సిఎం చెప్పారు. కేసీఆర్-జగన్ చర్చల సారాంశాన్ని తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారని, రాయలసీమను రతనాలసీమ చేస్తానని 2019 ఆగస్టు 13న కేసీఆర్ ప్రకటించారని సీఎం రేవంత్ దుయ్యాబట్టారు. గతంలో పలు సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలు సీఎం ప్రదర్శించారు. అందుకు సంబంధించిన కొన్ని వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచుతున్నామని, ఎంతో అనుభవం ఉందన్న వారే తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని నిర్ణయించుకున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయాక మరో విధంగా మాట్లాడుతున్నారని, చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు మళ్లీ ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి పారుదలశాఖ పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొని కేంద్రానికి కేసీఆర్, హరీశ్ రావు ఏం చెప్పారా అందరికీ తెలియాలని, గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లోకి తరలించుకువెళ్లి వినియోగించుకోవాలని కేసీఆర్ అన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.