14-05-2025 08:58:59 PM
హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జలసౌధలో నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉద్యోగం అనేది ప్రజల భావోద్వేగాలతో కూడుకున్నదని, ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. కొత్త ఉద్యోగుల్లో 90 శాతం మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారే ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఇంజినీర్లు ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చిందని, స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే ఏపీలో భారీ ప్రాజెక్టులకు నెహ్రూ శంకుస్థాపన చేశారని సీఎం పేర్కొన్నారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్, శ్రీశైలంతోనే మనకు నీళ్లు అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం 50, 60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి మనకు నీళ్లు ఇస్తున్నాయని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఎన్నో వరదలను తట్టుకుని నిలబడ్డాయని, లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లలోనే కూలిందని సీఎం పేర్కొన్నారు.
కట్టిన మూడేళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదని, రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో అదనంగా వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందలేదని అన్నారు. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)ది అని సీఎం రేవంత్ విమర్శించారు. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రూప్-1 నియామకాలు అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని, త్వరలోనే గ్రూప్స్ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.