31 August, 2026 | 10:03 AM

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై కీలక చర్చలు?

31-08-2026 08:44 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై కేంద్రంతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇదే పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో మార్పులపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నట్లు సమాచారం. కేబినెట్‌లో బీసీ నేతలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇచ్చే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ లేదా మార్పులపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది