మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఆలేరు, ఆగస్ట్ 30 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తన స్వగ్రామమైన మాదాపురంలో జరిగిన బోనాల వేడుకలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీకుమార్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






