calender_icon.png 29 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్మితకు ల్యాప్‌టాప్ బహూకరణ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

28-06-2025 11:02:55 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఇందూరి రష్మిత 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో 996/1000 మార్కులు సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందింది. ఈ విజయాన్ని డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ కార్యదర్శి బండి నాగేశ్వరరావు,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ల దృష్టికి తీసుకెళ్లారు.

నగరపాలక సంస్థ కమిషనర్ చొరవతో, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ సమక్షంలో రష్మితను ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా, ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి ఉపయోగపడేందుకు 70 వేల రూపాయల విలువ గల హెచ్పి ల్యాప్‌టాప్‌ను కలెక్టర్ చేతుల మీదుగా బహూకరించారు.

తన ప్రతిభకు తగిన గుర్తింపుగా రష్మిత, తమిళనాడు తంజావూరులోని శాస్త్ర యూనివర్సిటీలో బిటెక్ సిఎస్ఇ కోర్సులో సీటు సాధించింది. అయితే కుటుంబ పేదరికం కారణంగా చదువును కొనసాగించడంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. తండ్రి సత్యనారాయణ ముత్తగూడెం గ్రామం లో ఒక ప్రైవేటు స్కూల్లో చిన్న ఉద్యోగి. ఈ నేపథ్యంలో ఆమె జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నారై ఫౌండేషన్‌ లను సంప్రదించింది.

“కేవలం పేదరికం కారణంగా ఒక ప్రతిభాశాలి తన బంగారు భవిష్యత్తును కోల్పోకూడదు” అనే తాత్పర్యంతో ముగ్గురు అధికారులు రష్మితకు ఆర్థికంగా, మానసికంగా భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారు రష్మితకు “విద్యే నీకు ప్రపంచానికి పరిచయం. కష్టపడి చదువుకుంటే విజయాలు నిన్ను అనుసరిస్తాయి” అంటూ ప్రోత్సహక వాక్యాలు చెప్పారు. దాతల సహకారం తో తనకు కళాశాల ఫీజులు కట్టడానికి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సిద్ధంగా ఉన్నట్లు కార్యదర్శి బండి నాగేశ్వర్ రావు తెలియజేశారు.