14 July, 2026 | 7:48 PM

జక్కిడి శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి

14-07-2026 07:48 PM

- ఎల్బీనగర్ లో కొనసాగుతున్న బీసీ సంఘాల ఆందోళన 

ఎల్బీనగర్: బీసీ వర్గాల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గౌడ సంఘం నాయకులు, ఇతర బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పార్టీగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు సరైన గుర్తింపు, గౌరవం లేదన్నారు. ఇందుకు ఇటీవల యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు.

సీనియర్ నాయకురాలు, వృద్ధురాలైన ఈశ్వరమ్మ యాదవ్ పై శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన నాయకుడు బీసీలను అవమానపరిచే విధంగా మాట్లాడడం అగ్రవర్ణాల పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి, శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేవరకు ఆందోళన కొనసాగుతుందని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనలో బీసీ సంఘాల నాయకులు వేములయ్య గౌడ్, బొంగు వెంకటేశ్ గౌడ్, పోచబోయిన సురేశ్ యాదవ్, రాహుల్ , లింగాల కిశోర్, మల్లేశ్ గౌడ్, వెంకన్న గౌడ్, శివం గౌడ్, శ్రీధర్, ఉపేంద్ర, నీరజా గౌడ్, రాజు గౌడ్, డైరీ శేఖర్, సాంబశివ గౌడ్, దుర్గయ్య, నగేశ్, వినోద్ కుమార్, గిరి గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.