03-06-2025 08:02:07 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి మంజుల అనే మహిళ లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారు కుటుంబ సభ్యులు, అధికారులు, స్థానికుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya) ఇంటి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణ పనులను వేగవంతంగా నెల రోజుల్లో పూర్తయ్యే విధంగా చూడాలని లబ్ధిదారు కుటుంబ సభ్యులకు సూచించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు సూచించిన విధంగా వివిధ దశలకు ఇంటి నిర్మాణ బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు సంబంధిత బిల్లు జమ అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీని పరిశీలన..
ఐనవోలులోని రెండో రేషన్ దుకాణం ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. రేషన్ దుకాణానికి ఎన్ని క్వింటాల సన్న బియ్యం వచ్చిందని, ఇప్పటివరకు ఎంత పంపిణీ చేశారని సదరు డీలర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణం పరిధిలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, ఆ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ వేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.
రేషన్ దుకాణానికి వచ్చిన కార్డుదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బియ్యం రెగ్యులర్ గా తీసుకెళ్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్డుదారుకు బియ్యం తూకం వేసి అందిస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందించాలన్నారు. ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ జరగాలని డీలర్ కు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి కొమరయ్య, స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో రఘుపతి రెడ్డి, ఇతర అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.