29-07-2025 01:53:43 AM
సీడ్ కంపెనీల ప్రతినిధులకు మంత్రి తుమ్మల ఆదేశం
గద్వాల, జూలై 28 ( విజయక్రాంతి ) : జోగులంబ గద్వాల జిల్లా సీడ్ పత్తి సాగు చేసిన రైతులకు పెండింగ్ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్ కంపెనీలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
గద్వాల జిల్లా రైతులు సుమారు 50 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను సాగు చేశారని, నెలల గడిచినా ఇప్పటి వరకు వారికి సంబంధిత కంపెనీలు డబ్బు చెల్లింపులు చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంఎల్ఎ కృష్ణామోహన్రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎంఎల్ఎ కృష్ణామోహన్రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి స్థంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, సీడ్ కంపనీల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి తుమ్మల డా.బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, గద్వాల జిల్లా రైతాంగం పత్తి విత్తనాల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, దేశానికి తలమానికమని అన్నారు. విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందిస్తే ఆయా కంపెనీలు రైతులకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా ఆయా కంపెనీలు తక్షణమే స్పందించి నెల రోజుల్లోగా బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని సీడ్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు రూ.700 కోట్లు రైతులకు బకాయిలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
రైతులు, వారిపై ఆధారపడిన రైతుకూలీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా లాంటి కార్యక్రమాలతో రాష్ట్ర రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతుల లాభం, సౌకర్యం, వారి సంక్షేమమే మా ప్రాధాన్యమని మంత్రి అన్నారు.