అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి
సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు సిపిఎం ఘన నివాళులు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
గోవిందరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని కొనసాగించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి(CPM State Committee Member Sudi Krishna Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఎం పార్టీ(CPM Party) గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పసర సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ కడారి నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం ఈ సభకు కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం,దొరల దోపిడీ పీడన కి వ్యతిరేకంగా కొనసాగిందని అన్నారు. 1948 నుండి 51 వరకు భారత దేశ చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మరువలేనిదని అన్నారు.
ఈ పోరాటంలో వేలాదిమంది మహిళలు చిత్రహింసలకు గురైనారని అనేకమంది ప్రాణాలు వదిలారని తెలిపారు. దొడ్డి కొమురయ్య సాకలి ఐలమ్మ నల్ల నరసింహులు టాను నాయక్, షేక్ బందగి లాంటి ఎందరో వీరులు నెలకొరిగారని ఈ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని 4000 మంది ప్రాణాలు బలిదానం చేశారని తెలిపారు. వారి పోరాట ఫలితమే పదివేల గ్రామాలు విముక్తి చేయగలిగామని తెలిపారు. ఈ పోరాట ఫలితంగానే నిజాం ప్రభుత్వం తలవంచి తోక ముడిచిందని తెలిపారు.
కానీ, ఈరోజు చరిత్రకు సంబంధంలేని వారు చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇది హిందూ ముస్లిం పోరాటం కాదని ధరల దోపిడీకి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమని, ఏ గడపని అడిగిన సజీవ సాక్షాలు తెలంగాణలో కనపడతాయని ఆయన తెలిపారు. నేడున్న పాలకులు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరో పోరాటానికి సన్నద్ధం కావాలని కోరారు.