27 February, 2026 | 11:19 AM

రూ.3.09 లక్షలు దోచుకున్న సైబర్ కేటుగాళ్లు

27-02-2026 12:59 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన విశాల్ పవర్ జిమ్ నిర్వాహకుడు, బిజెపి సీనియర్ నాయకుడు ఖండ్రే విశాల్ సైబర్ మోసానికి గురయ్యాడు. అతని ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.3 లక్షల 9 వేల రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతని ఫోన్‌కు వరుసగా లావాదేవీలకు సంబంధించిన మెసేజ్లు రావడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే తన బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, రూ.500 నుంచి రూ.50,000 వరకు విడతలవారీగా కొద్ది కొద్ది వ్యవధిలో మొత్తం రూ.3.09 లక్షలు డెబిట్ అయినట్లు గమనించాడు.

తాను ఎలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయలేదని, ఓటీపీలు కూడా ఎవరికీ చెప్పలేదని అయినప్పటికీ తన ఖాతాల నుంచి డబ్బులు మాయమవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.