రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ధర్నా
కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు..
ఉట్నూర్, జులై 23 ( విజయక్రాంతి ): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi arrest) పై దాడి చేసి అరెస్ట్ చేయడం ఆ ప్రజాస్వామికమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఉట్నూరు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆర్టిఏ సభ్యుడు దూట రాజేశ్వర్ ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీ జులిపించడం అప్రజా స్వామి కమని అన్నారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత , ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తో పాటు ఎంపీ ప్రియాంక గాంధీని, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం చీకటి రోజని అన్నారు. విద్యార్థులకు దేశ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పే వరకు, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.






