21-07-2025 07:44:01 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నూతనంగా 2469 మంది లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అట్టడుగు వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఆరోగ్య శ్రీ, 104, 108, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటివి పేదలకు బాసటగా నిలిచాయని నేడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రాని ఆలోచన విధానం ఈ రోజు సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం సరఫరా అవుతుందని చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నదని అన్నారు. ఆరు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తున్న కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు అభివృద్ధి జరగటం లేదనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
పదేళ్లలో ఒక్కరికి రేషన్ కార్డివ్వని అసమర్థులు నేడు ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందజేస్తుంటే జిత్నించుకోలేక విమర్శిస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు సంపాదించిన భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు. మీ హయాంలో పథకం అమలు జరగాలంటే కార్యకర్తలు, ఎమ్మెల్యే బంధువులకు తప్ప మరొకరికి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజలు నమ్మకంతో మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్నామని రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమాంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.