16-09-2025 07:58:31 PM
హనుమకొండ,(విజయక్రాంతి): విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉందని, అభ్యసన స్థాయిని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు లోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలోని ఏడు, ఎనిమిది, పదో తరగతులను సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పదో తరగతి విద్యార్థులను గణిత సబ్జెక్టుకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రి మిడ్లైన్ టెస్ట్ పరిశీలించారు. విద్యార్థుల ప్రవర్తన రీతి ఎలా ఉంటుందని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీశారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉండేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగ్గా ఉండాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలన్నారు.