10-11-2025 04:43:30 PM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్ లో పెట్టవద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 86 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు. రెవెన్యూకు 30, డీఆర్డీఓ కు 14 , హౌసింగ్ కు 13, డీపీఓకు 8, ఎస్డీసీ, డీఎంహెచ్ఓ, ఉపాధి కల్పన అధికారికి మూడు చొప్పున, సెస్, డీఏఓకు రెండు చొప్పున, డీసీఎస్ఓ, డీఈఓ, ఏడీ సర్వే, ఎక్సైజ్, జిల్లా రిజిస్ట్రార్, డీవీహెచ్ఓ, గిరిజన సంక్షేమ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.