9 April, 2026 | 3:09 AM

డంప్ యార్డ్ ఏర్పాటు చేయొద్దు

09-04-2026 01:17 AM
  1. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు

నాపై కోపం ఉంటే ఉరి తీయండి

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): తనపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరితీయాలి కానీ.. డంప్ యార్డ్ ఏర్పాటు చేసి హుజురాబాద్ ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డు వ్యతిరేక దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని, మద్ధతుగా 24గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు.బుధవారం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన దీక్షకు మద్ధతు తెలిపి విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు.డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లక్ష మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

డంపింగ్ యార్డ్ తొలగించకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. హుజురాబాద్ ప్రజల మద్దతుతో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.