calender_icon.png 28 June, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆసుపత్రికి వచ్చిన మంచి పేరును నిలబెట్టుకోవాలి

27-06-2025 10:51:55 PM

ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల వైద్యులు ప్రోత్సహించాలి

జిల్లా ఆసుపత్రిపై అధికారులతో రివ్యూలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రజలలో పెద్దపెల్లి జిల్లా ఆసుపత్రికి మంచి పేరు వచ్చిందని, దానిని నిలబెట్టుకునెలా మన పని తీరు ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఆసుపత్రి పని తీరు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రికి ప్రజా ప్రతినిధులు, ప్రజలలో మంచి పేరు వచ్చిందని, ఆసుపత్రిలో రోగులను బాగా చూస్తున్నారని, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని,  ప్రజలలో నమ్మకం కల్గుతుందని,  ఆ విశ్వాసం నిలబెట్టుకునేలా మనం పని చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సి-సెక్షన్ ఆపరేషన్ లు అధికంగా జరుగుతున్నాయని, మొదటి కాన్పు కేసులు ఆరోగ్యం సహకరిస్తే సాధారణ ప్రసవాలు చేయాలని అన్నారు.

ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య కూడా తగ్గుతుందని, మన దగ్గరే అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. గైనిక్ ఓపి రెగ్యులర్ గా ఎంత వస్తుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిఫ్ఫా స్కానింగ్ సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని, అవసరమైన గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ లో డబ్బులు ఖర్చు చేయకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో గైనిక్ శాఖకు యంత్రాంగం తరపున సంపూర్ణ మద్దతు అందిస్తామని అన్నారు.  సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, ఒత్తిడులకు తలవంచి అనవసరపు ఆపరేషన్ చేయవద్దని,  గర్భిణి స్త్రీల మొదటి నుంచి సాధారణం ప్రసవాల వైపు ప్రోత్సహించాలని, అవసరమైన వ్యాయామాలను చేయించాలని అన్నారు. 

ఆర్థోపెడిక్ విభాగం లో  జరిగే శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నామని, మంచి అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, కంటి శస్త్ర చికిత్స ప్రత్యేక విభాగం కూడా ఆసుపత్రిలో ఉందని, ఆరోగ్య శ్రీ క్రింద ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాలని, కంటి వైద్య విభాగంలో అవసరమైన వారికి అద్దాలను సైతం అందించాలని అన్నారు. చిన్న పిల్లల వైద్య విభాగంలో అందుతున్న వైద్య సేవల గురించి చర్చించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. డయాగ్నొస్టిక్ హబ్ వద్ద శాంపిల్ తీసుకున్న తర్వాత 45 నిమిషాల నుంచి గంట లోపు రిపోర్ట్ అందించేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్.బీ.ఎస్.కే వైద్య బృందం పిల్లల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.  ఆసుపత్రిలో ఏదైనా  విభాగంలో వైద్యుల అవసరం ఉంటే, ప్రభుత్వం నుంచి సాంక్షన్ లేకపోయినప్పటికీ నియమించాలని కలెక్టరేట్ నుంచి వేతనం చెల్లిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం ఉండకూడదని,  జవాబుదారీతనంతో మనం పని చేయాలని, ఔట్ పేషెంట్ సమయంలో వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అన్నారు.  ఔట్ పేషెంట్ సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో వెయిటింగ్ ఏరియా లో అవసరమైన కూర్చీలు, ఇతర వసతులు కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో 24 గంటల పాటు పేషెంట్ కేర్ సరిగ్గా ఉండేలా చూడాలని, మనం ఉన్నా లేకపోయినా  ఆసుపత్రి పని తీరు మారకుండా జరిగే మంచి మార్పులను వ్యవస్థికరణ చేయాలని అన్నారు.  జిల్లా ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు అందించేందుకు ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ ఫైల్ 48 గంటల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ తెలిపారు.