26-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 25: ఎన్డీయే పాలిత ప్రాంతాల నేతలు, బీజేపీ నాయకులు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. ఆదివారం న్యూఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, పలువురు కేంద్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు చేసే అనవసర ప్రకటనలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడొద్దని ఆయన నాయకులకు హితవు పలికారని సమాచారం. ఆపరేషన్ సిందూర్లో మూడో పక్షం జోక్యం లేదని ప్రధాని వెల్లడించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే కూటమి కుల రాజకీయాలను నమ్మదు. కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి దోహదపడుతుంది.’ అని వెల్లడించారు.
రెండు తీర్మానాలు
ఈ సమావేశంలో నేతలు రెండు తీర్మానాలు చేశారు. సాయుధ బలగాల ధైర్యసాహసాలను, ప్రధాని నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ ఆపరేషన్ సిందూర్పై ఒక తీర్మానం. కుల గణనపై మరో తీర్మానం చేశారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ సీఎంలతో దిగిన ఫొటోలను ఎక్స్లో షేర్ చేశారు.
ఆ సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. ‘ఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రుల భేటీలో పాల్గొని అనేక అంశాలపై చర్చించాం. రాష్ట్రాలు సాధించిన ప్రగతిని, వారు అవలంభిస్తున్న పద్ధతులు, వారి అనుభవాలు వినడం చాలా సంతోషాన్నిచ్చింది.’ అని తెలిపారు.