16-06-2025 09:07:24 PM
ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కలెక్టర్ కు వినతి..
పెద్దపల్లి (విజయక్రాంతి): మంథనిలో ఏర్పాటు చేసిన గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలను పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ఆ కళాశాలను తిరిగి మంథనికి తరలించడంతో ఇక్కడ చదివే విద్యార్థినులకు అసౌకర్యం కలుగుతుందని, ఆ కళాశాలను పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోనే కొనసాగించాలని పెద్దపల్లి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ(Peddapalli Muslim Joint Action Committee) సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పెద్దపెల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బాలుర, బాలికల కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, మంథనిలో ఏర్పాటుచేసిన బాలికల జూనియర్ కళాశాలను అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారని, పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో కూడా ఒక కళాశాల ఏర్పాటు చేశారని కానీ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల కళాశాలలో సిఇసి, ఎం ఈ సి, సబ్జెక్టులు పెట్టారని, మంథని కళాశాలలో బైపిసి, ఎంపీసీ సబ్జెక్టులు పెట్టారని, జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు మండలాల్లో ఉన్న నిరుపేద ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా బైపిసి, ఎంపీసీ సీట్లలో భర్తీ అయ్యారని, ఆ కళాశాలను మంథని కి తరలిస్తే ఎక్కువ శాతం అమ్మాయిలు మంథని కి వెళ్లే పరిస్థితి లేదని, ప్రభుత్వ అధికారులు, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ విషయమై చొరవ తీసుకొని మంథని కళాశాలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే కొనసాగిచ్చేటట్టు ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.
కళాశాలను మంథనికి తరలిస్తే ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎ మోహిద్, అబ్దుల్ హై జావిద్, ఏ ఆర్ షాకీర్, మహమ్మద్ రహీం, మొహమ్మద్ జహెద్, తబ్రేజ్ ఖాన్ ,మహమ్మద్ షహబాజ్, సయ్యద్ యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ కళాశాల తరలిస్తే ఆందోళన తప్పదు
టిడిపి జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి
రాఘవపూర్ లో ఏర్పాటు చేసిన మైనార్టీ కళాశాలను మంథని కి తరలిస్తే ఆందోళన కార్యక్రమాలు తప్పవని టిడిపి జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి తెలిపారు. స్థానిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని మైనార్టీల పట్ల కాంగ్రెస్ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మైనార్టీ కళాశాలను మంథనికి తరలిస్తే బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.