18-06-2025 12:06:52 AM
అటవీ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): గిరిజన రైతులను సాగు విషయంలో అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన దృష్టికి అనేకసార్లు గిరిజనులు తీసుకువచ్చారని, ఏ ఒక్క గిరిజన రైతును ఇబ్బంది పెట్టిన సహించేది లేదని, పోడు భూముల్లో సాగుకు అవసరమైన బావులు తీయడం, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలిగించవద్దని అటవీశాఖ అధికారులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదేశించారు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని, అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
అలాగే కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో స్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవసరమైన స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గూడూరు మండలం భీముని పాదం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, కార్యచరణ పై చర్చించారు.