18-06-2025 12:05:26 AM
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ కేసముద్రం ప్రధాన రహదారిలో వేమునూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద సోమవారం రాత్రి అశోక్ లేలాండ్ మినీ వాహనం గ్రానైట్ లారీ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇనుగుర్తి మండలం మీట్యా తండాకు చెందిన ఓ కుటుంబం అశోక్ లేలాండ్ మినీ వాహనంలో ఇల్లందు సమీపంలోని మిరియాల పెంట గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మీట్యా తండాకు చెందిన గుగులోత్ రాజు (30) మరణించాడు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఎస్ ఐ దీపిక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద క్షతగాత్రులను, మృతి చెందిన రాజు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించారు. ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.