15-06-2025 05:59:54 PM
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించేలా చర్యలు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యుజె-ఐజెయు పెద్దపల్లి జిల్లా మూడవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా పూర్వ అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడి యూనియన్ నాయకులతో కలిసి వెళ్దామన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టు సమస్యలు విస్మరించిందని, పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నాడు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడేది మనమే
టియుడబ్ల్యు ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
70 ఏండ్ల సుధీర్ఘ కాలంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం మనదేనని టియుడబ్ల్యుజె - ఐజెయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అన్నారు. పెద్దపల్లి మహాసభలో ఆయన మాట్లాడుతూ... జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇప్పించింది మన సంఘమేనని గుర్తు చేశారు. దశల వారీగా మన హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాటానికి సిద్ధం అవుదామని చెప్పారు. శాంతి మార్గంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమ పోరాటం తప్పదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ మాట్లాడుతూ... మన హక్కుల సాధన కోసం చివరి అంకంగా పోరాటం చేయక తప్పదన్నారు.
కలిసికట్టుగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ... మన జర్నలిస్టు సంఘం కేవలం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జర్నలిస్టులకు ఎన్నో సాధించామని, ఇంకా సాధించాల్సిన అనేక సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ మాట్లాడుతూ... తన పదవి కాలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పని చేశానని తెలిపారు. సమావేశంలో మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, మాజీ కౌన్సిలర్ తూముల సుభాష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వంశీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఎన్నికల అధికారి ఎలగందుల రవీందర్, సహాయ ఎన్నికల అధికారి గుడ్ల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ గౌడ్, టికె శ్రీనివాస్, సామల హరికృష్ణ, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి, నారాయణదాసు, అశోక్, వీరమల్ల విద్యాసాగర్ రావు, ఆకుల రమేష్, జర్నలిస్టులు పాల్గొన్నారు.