15 May, 2026 | 6:32 PM

బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ కాంగ్రెస్ కైవసం

15-05-2026 05:33 PM

కోఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఏకగ్రీవం, మైనారిటీ కోటాలో ముజ్జు గెలుపు

13 ఓట్లతో ముజ్జు ఎన్నిక, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై విజయం

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. నామినేషన్లు వేసిన నలుగురు కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైనారిటీ కోటాలో కాంగ్రెస్ తరఫున మొహమ్మద్ మజీద్ ముజ్జు నామినేషన్ వేయగా, బీజేపీ నాయకుడు రాజాసింగ్ పోటీ చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, ఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు మద్దతు పలికారు.

దీంతో 13 ఓట్లతో ముజ్జు విజయం సాధించారు. సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు గైర్హాజరయ్యారు. బీజేపీ సభ్యులు ఓటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ బాలరాజు అధ్యక్షతన, వైస్ చైర్మన్ రేష్మ ఏజాజ్ సమక్షంలో మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ సాగింది.

నామినేషన్ల దాఖలు చివరి రోజు సందర్భంగా కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్ ముజ్జు, కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్‌లు కోఆప్షన్ సభ్యత్వానికి నామినేషన్లు దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో ప్రతిమా రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, ఉల్లవ్వ నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు.బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం చూసుకున్నారు.