calender_icon.png 16 July, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేసి... నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలి

16-07-2025 12:10:00 AM

  1. డయల్ 100 నకు ఫోన్‌కు త్వరితగతిన స్పందించాలి

నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 15,(విజయ క్రాంతి):పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసును సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్షపడేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. పెట్రోలింగ్,బ్లూ కోలట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలు, మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. వర్టికల్స్ వారీగా ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, జిల్లాలోని సిఐలు,ఎస్త్స్రలు  పాల్గొన్నారు.