రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్యవసాయం,
సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే 99 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలనలో భాగంగా అధికారులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
లాభసాటి పంటలపై దృష్టి సారించాలి
ప్రస్తుత సీజన్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు సాంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభసాటిగా ఉండే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. రానున్న వర్షాకాలంలో ఎల్ నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ వాతావరణ శాఖ హెచ్చరుస్తుందన్నారు. వర్షాలు సకాలంలో పడకపోతే, వరి పంట చేతికొచ్చే సమయానికి ఆశించిన దిగుబడి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ఈ నష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా.. విడతల వారీగా ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో వ్యవసాయ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం తమ ఇళ్లకు వచ్చే బీఎల్ఓల దగ్గర ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి అందించాలని కోరారు. అలాగే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం అందడం ఎంతో కీలకమని, ఆ దిశగా తల్లిదండ్రులు, అధికారులు కృషి చేయాలన్నారు.
రాబోయే రోజుల్లో రామన్నగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని వార్డుల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఈ నెల 25వ తేదీ లోపు సబ్ మీట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఎంపీడీవో బాలకృష్ణ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






