calender_icon.png 1 June, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..

06-05-2025 07:50:47 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టార్పాలిన్ కవర్లు సరిపోను అందుబాటులో ఉంచామని, వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య(District Collector P Pravinya) సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటపర్తిలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా  ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు, చేసిన ఏర్పాట్లను కలెక్టర్ అధికారులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన రికార్డులను  కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులు, నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... హనుమకొండ జిల్లాలో 150 ఐకెపి, పిఎసిఎస్ ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. చౌటపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు ఎనిమిది వందల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని, ఇంకా 600 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపుగా 50 శాతం పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలోనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతుల వివరాలను నమోదు చేశామని, వారికి త్వరలోనే ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు కూడా అందుతాయన్నారు. వర్షం, వాతావరణ పరిస్థితులను గురించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోను టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏమైనా తడిసిన ధాన్యం ఉన్నట్లయితే తొందరగా మిల్లులకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాగా నాని ఉన్న ధాన్యం సమస్య ఎక్కడ రాలేదన్నారు. వర్షానికి ధాన్యం తడవకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. రెండు మూడు రోజులపాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, స్థానిక తహసిల్దార్ నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.