6 March, 2026 | 6:01 AM

భయంవీడి ధైర్యంగా పరీక్షలు రాయాలి

06-03-2026 12:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని పరీక్షలు రాయాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుందిళ్ల రమేష్ అన్నారు. గురువారం సిర్పూర్ (టి) ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు, బాలికల పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు లక్ష్య సాధనపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సుందిళ్ల రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని విడిచిపెట్టి ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. చదువుపై నిజమైన ఆసక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదువుతూ సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు.

పీఎంఆర్సీ ఏసీఏఎంఓ పూర్కా ఉద్ధవ్ మాట్లాడుతూప్రతి విద్యార్థి జీవితాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కన్నయ్య, రవీందర్,వార్డెన్ రాణి, సీహెచ్ మధుసూదన్, బి. శ్రీనివాస్, ఆర్‌ఐ స్వప్న, సీఆర్పీ పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.