కామారెడ్డి జిల్లాలో ఎరువుల దుకాణాలు బంద్
- రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు బందు పాటించిన
- ఎరువుల దుకాణాల యజమానులు
కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ఎరువుల దుకాణదారుల అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్ పాటించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుకాణాలు బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారస్తులు భాగ్యలక్ష్మి శ్రీనివాస్, చందు, బోనగిరి కృష్ణమూర్తి, లు మాట్లాడుతూ ఎరువుల ఉత్పత్తిదారులు ఎరువుల సరఫరా పై ఎఫ్ ఓ ఎల్ విధానం అనగా రవాణాచార్జీలు హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎరువుల సరఫరాలో యూరియా, డిఎపి, వాటితోపాటు లింకు విధానంతో వివిధ ఉత్పత్తులను అంట కట్టి ఇటు డీలర్లకు రైతులకు అదనపు భారం మోపటం సరైంది కాదని వెంటనే లింకు విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. డీలర్లకు మార్జిన్ పెంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరువుల దుకాణాల డీలర్లు, యజమానులు, తదితరులు పాల్గొన్నారు.






