19-02-2026 01:02:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నిక లు ముగియడంతో ఇక రాష్ట్రంలో రాబో యే ఎన్నికలపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కార్యాచరణను రూపొందించుకొని ముందుకుపోవాలని నిర్ణయించింది.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్ నగరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీ సంస్థాగత జాతీ య సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ అభ య్ పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ దక్షిణాది రాష్ట్రా ల మహాప్రశిక్షణ అభియాన్ ఇన్చార్జ్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్తో పాటు, రాష్ట్ర నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని నాయకులకు ఆయన సూచించారు. కార్యాచరణ, ప్రణాళికలు రచించుకొని ప్రజాసమ స్యలపై నిత్యం పోరాటం చేయాలని ఆదేశించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులు కష్టపడాలని, సమన్వయంతో కలిసికట్టుగా అందరూ ముందు కుపోవాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు, ఫలితాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రచారం బాగానే చేసినప్పటికినీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా గట్టిగా పనిచేయాలని నాయకులకు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో నేతల తీరుపై అధిష్ఠానం సీరియస్ అయ్యింది. పొత్తులపై జాతీయ పార్టీ నివేదిక కోరింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాటలను లెక్కచేయకుండా పొత్తులు ఎలా పొత్తులు పెట్టుకుంటారని నేతల తీరుపై జాతీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎవరెవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారో దానిపై రాష్ట్ర కమిటీ నివేదికను జాతీయ నాయకత్వానికి వెంటనే పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నేతల పనితీరు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నివేదిక పంపుతామని రాంచందర్రావు జాతీయ నాయకత్వానికి తెలిపారు.
శభాష్.. బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం, ఈ గెలుపులో కీలక పాత్ర వహించిన కేంద్రమంత్రి బండి సంజయ్ను ‘శభాష్ బండి’ అంటూ జాతీయ నాయ కత్వం మెచ్చుకుంది. ఈ మేరకు బం డి సంజయ్ను జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ అభినందించడంతోపాటు బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ప్రత్యేకంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ తొలిసారిగా కార్పొరేషన్ మేయర్ పదవిని చేజిక్కుంచుకోవడం అభినందనీయమని జాతీయ అగ్ర నాయకత్వం పేర్కొంది. దీంతోపాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్కు సైతం పార్టీ నాయకత్వం అభినందనలు తెలిపింది.