11 March, 2026 | 8:12 AM

హత్యకు దారి తీసిన ఆర్థిక లావాదేవీలు

09-03-2026 12:30 AM

అప్పు విషయంలో స్నేహితుల మధ్య వివాదం 

ఎల్బీనగర్, మార్చి 8: అప్పు తీర్చే విషయంలో తలెత్తిన వివాదం వ్యక్తి హత్యకు దారి తీసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన యాదయ్య, సతీశ్ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ బోరబండ పరిధిలోని మోతీనగర్ లో ఉంటున్నారు. ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో హోటళ్ళలో పని చేస్తున్నారు. ఇద్దరి మధ్యన డబ్బుల లావాదేవీలు ఉన్నాయి.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో సతీష్ తన హోటల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చాడు. అక్కడ యాదయ్యను డబ్బుల విషయమై ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సతీష్ తనతో వచ్చిన వ్యక్తులతో కలిసి యాదయ్య(30)పై దాడి చేశారు.

ఈ దాడిలో యాదయ్య స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆటోలో సమీపంలోని జీబీఆర్ హాస్పిటల్కు తరలించగా, యాదయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు యాదయ్య తండ్రి యెడ్ల కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.