15 July, 2026 | 12:20 PM

జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు

15-07-2026 12:19 PM

ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

450 మంది విద్యార్థులు సురక్షితం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్‌ పట్టణంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పెట్రోల్ పంపు పాఠశాలలో బుధవారం ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు వారిని వెంటనే సురక్షితంగా బయటకు తరలించడంతో ఎలాంటి నష్టం జరగలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.గ్యాస్ పైపు లీక్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.