25-06-2025 12:44:14 AM
ఎల్లారెడ్డి, జూన్ 22,(విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆటవి ప్రాంతాన్ని రాత్రివేళ లో కొందరు భూకబ్జాదారులు ఎక్స్వేటర్లు, ఉపయోగించి చెట్లను తొలగిస్తూ స్థలాలను చదును చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, మాచారెడ్డి అటవీ రేంజ్ల పరిధిలోని పలు తండాలు గ్రామాల తో పాటు ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్, బీట్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
రాత్రి పూట ఎక్స్కవేటర్లతో అడవిలోని చెట్లు, పొదలను తొలగించి అక్రమార్కులు దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు.ఎక్కపల్లి,సజ్జన్పల్లి, తండాకు చెందిన కొందరు అటవీలోని చెట్లను నరికి భూములను చదును చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టం అవుతోంది. కబ్జాదారులు ముళ్లపొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంటపొలాలుగా మార్చుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత తిరిగి అటవీ భూములు అక్రమణకు గురవుతున్నాయి. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో పాటు రేంజర్ అధికారి వారికి తోడై ఉండటంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండు చేశారు.
ఎట్టకేలకు ఎల్లారెడ్డి రేంజ్ అధికారి, సస్పెన్షన్తో కలకలం రేపింది. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని 9,685 ఎకరాలలో అటవీ సంపద కనుమరుగు అయింది. దీని వెనుక అటవీశాఖ అధికారుల హస్తాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం అవినీతితో కలప అక్రమ రవాణా తోపాటు యదేచ్చగా అటవీ భూముల్లో కొందరు ఆక్రమణదారులు ఆక్రమించడం రేంజ్ అధికారి సస్పెన్షన్తో కలకలం రేపింది.
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో రెండు ఎకరాల అటవీ స్థలం ఆక్రమణ జరుగుతున్న అడ్డుకోవడంలో రేంజ్ అధికారి విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఈనెల 20న పీసీసీ సీఎం సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖలో కలకలం రేపింది. రేంజ్ అధికారి పై వేటుపడడంతో అటవీశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
2024లో సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి వినయ్తో పాటు సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ లను తోంపల్లి సెక్షన్ లోని జంగిడిలోని తండాలో జరిగిన ఘటన అటవీ భూముల ఆక్రమణలో హస్తము ఉందని అటవీ అధికారులపై వేటు వేశారు. సరిగ్గా ఏడాది తర్వాత ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారి సస్పెండ్ కావడం పట్ల చర్చనీయాంశంగా మారిపోయింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లాకు డి ఎఫ్ ఓ పర్యవేక్షణలో నలుగురు ఎఫ్ డి వోలు 14 మంది ఎఫ్ఆర్వోలు ఉన్నప్పటికీ అటవీ సంపద మాత్రం అన్యక్రాంతం అవుతూనే ఉంది. నైజాం కాలం నాటి అటవీ చట్టాలను కొనసాగిస్తూ పోడు భూముల వ్యవహారంలో వాటిని అమలు చేస్తున్నడంతో భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడడం లేదు. దానికి తోడు అటవీశాఖలో అధికారులు అవినీతితో వన సంపద కరిగిపోతుంది.
అటవీ భూముల్లో మొరం తవ్వకాలతో ఏర్పడిన ఖాళీ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు. మన్యపురాని వేట మాత్రం సాగుతూనే ఉంది. అటవీశాఖలో అధికారులపై వెయిట్ వేసినప్పుడు మాత్రమే వెనక్కి తగ్గుతున్న అధికారులు, షరా మామూలుగానే పట్టించుకోకపోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎల్లారెడ్డి రేంజ్ అధికారి ఓంకార్ సస్పెన్షన్ పై అటవీ శాఖలో అధికారులంతా అప్రమత్తంగా నడుచుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇకనైనా తమ తీరు మార్చుకొని అటవీని కాపాడాలని ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులకు గట్టిగా హెచ్చరించారు.