మహారాష్ట్రలో దారుణం— పెద్దపులి దాడిలో నలుగురు మహిళలు మృతి
ముంబై: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో(Chandrapur district) దారుణం చోటుచేసుకుంది. సిందేవాహి తాలూకా పరిధిలోని గుంజేవాహి-పవన్పార్ ప్రాంతంలో పులి దాడిలో(Tiger Attack) నలుగురు మహిళలు మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్ జిల్లాలో తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో మానవ-వన్యప్రాణి సంఘర్షణకు సంబంధించిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, 13 మంది మహిళలు టేకు ఆకులను సేకరించడానికి అడవిలోకి వెళ్లగా, ఆ ప్రాంతంలోనే దాగి ఉన్న ఒక పులి వారిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మహిళలు మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన అటవీ ప్రాంతంలోని గ్రామస్తులలో భయాందోళనలు రేకెత్తించగా, అటవీ శాఖ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణను ప్రారంభించాయి. ఇటీవలి సంవత్సరాలలో మానవ వన్యప్రాణి సంఘర్షణకు సంబంధించిన పలు ఘటనలు చోటుచేసుకున్న ఈ ప్రాంతంలో, అధికారులు పులుల సంచారాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మహిళలు మృతి చెందడంతో చంద్రపూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.






