బాలెన్షాకు జెన్జీ సెగ
నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే వ్యతిరేకత
బైక్ రైడర్ ఆత్మహత్యపై భగ్గుమన్న యువత
ఖాఠ్మాండు, జూలై ౧౪: జెన్జీ తరం మద్దతుతో నేపాల్ ప్రధాని అధిరోహించిన బాలెన్ షా, పట్టుమని నాలుగు నెలలైనా గడువముందే తిరిగి జెన్జీ తరం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. దేశ రాజధాని ఖాఠ్మాండులో బైక్ పార్కింగ్ విషయంలో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానైంది.
నో-పార్కింగ్ జోన్లో గణేష్ అనే బైక్ రైడర్ తన వాహనాన్ని నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు తాళం వేశారు. దీంంతో సదరు రైడర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షతగాత్రున్ని అక్కడి యంత్రాంగం న్యూఢిల్లీ ఎయిమ్స్కు తరలించగా, మరుసటి రోజే మరణించాడు. గిగ్ వర్కర్ మృతి అంశం నేపాల్లో పెద్ద దుమారానికి తెరలేపింది. జెన్జీ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఎంపీ బసనా థాపా మాట్లాడుతూ.. ఒక యువకుడు యంత్రాంగం వేధింపులకు బలైపోతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని మండి పడ్డారు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నేరస్థుడిలా లాక్కెళ్లారే తప్ప ఆంబులెన్స్ పిలవలేదని ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ విష్ణు బహదూర్ కూడా ప్రధాని బాలెన్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్ల అద్దాలు తీసి ప్రధాని ప్రజల కష్టాలను చూడాలని ప్రతిపక్షానికి చెందిన ఓ ఎంపీ ఎద్దేవా చేయగా.. మరికొందరు ప్రధాని తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యంత్రాంగం ప్రజలను పీడిస్తున్నదని, వారిపై అపరాధ రుసుములు, జరిమానాలు విధించడం దారు ణమని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై హోమంత్రి స్పందించారు. రైడర్ మృతికి కారణమైన ముగ్గురు ట్రాఫిక్ పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించారు.






