కలెక్టర్ను కలిసిన జీఎం రమేష్
కొత్త గనుల విస్తరణ, బొగ్గు ఉత్పత్తిపై చర్చ
ఆసిఫాబాద్(విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎం. రమేష్ జిల్లా కలెక్టర్ కె. హరితను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం బెల్లంపల్లి ఏరియా పరిధిలోని బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ, భవిష్యత్ మైనింగ్ ప్రాజెక్టులపై కలెక్టర్తో జీఎం సుదీర్ఘంగా చర్చించారు.బెల్లంపల్లి ఏరియా అభివృద్ధిలో గోలేటి ఓపెన్ కాస్ట్ (ఓసీ) గని కీలకమని, దీనిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జీఎం వివరించారు.
ప్రస్తుతం ఏరియా పరిధిలో ఖైరిగుర ఉపరితల గని నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.భవిష్యత్తులో ప్రారంభం కానున్న గనులు, ప్రతిపాదనల దశలో ఉన్న వివిధ మైనింగ్ ప్రాజెక్టుల వివరాలను కూడా ఈ సందర్భంగా కలెక్టర్కు సమర్పించారు. కొత్త గనుల ప్రారంభానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు వేగంగా లభించేలా జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని జీఎం కలెక్టర్ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.






