అశ్వాపురం ఓటర్ల జాబితాపై గ్రామసభ
ముసాయిదా జాబితాను పరిశీలించిన ప్రజలు
అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచన
అశ్వాపురం, ఆగస్టు 27(విజయక్రాంతి): అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా ముసాయిదాపై గురువారం గ్రామసభను ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించారు. సర్వేలో భాగంగా సేకరించిన ఓటర్ల వివరాలను 11 మంది బీఎల్ఓలు వార్డుల వారీగా గ్రామ ప్రజల సమక్షంలో వెల్లడించారు. మరణించిన ఓట్లు, ఇతర ప్రాంతాలకు తరలిన ఓట్లు, డబుల్ ఓట్లు, శాశ్వతంగా తరలిపోయిన ఓట్లకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు లేదా మార్పులు ఉంటే గ్రామసభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో బీఎల్ఏలు, బీఎల్ఓ సూపర్వైజర్ వేలదండి కనకమహాలక్ష్మి, 11 మంది బీఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శి యాకూబ్, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






