calender_icon.png 17 June, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకు పాటైనాడు!

15-06-2025 01:30:00 AM

అతని పేరులో పల్లె ఉన్నందుకో ఏమో తెలియదు కానీ పల్లె బతుకును పాటగట్టి పాలకులకు అర్థమయ్యేలా చేశాడు. పల్లె కన్నీరు పెడితే పాటకు పదునుపెట్టి పాలకులపై కదనరంగానికి దూకుతాడు. పల్లె నుంచి పట్నందాకా, ఊరు నుంచి వాడదాక ఎక్కడ పేదోడికి కష్టం వచ్చినా నేనున్నానంటూ పాటై పాలకులను ప్రశ్నిస్తాడు జానపద కళాకారుడు పల్లె నర్సింహ.. ఆయనతో విజయక్రాంతి మాట.. ముచ్చట.

పాట ఎలా అలవాటు అయ్యింది?

మాది నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లె. నేను పాఠశాల రోజుల్లో ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసేవాన్ని. అలా పనిచేస్తున్న క్రమంలో ఏదైనా మీటింగ్ నిర్వ హిస్తే అందులో పాటలు పాడేవాన్ని. అలా పాట నాకు అలవాటుగా మారింది. పైగా ఎక్కడ పాటల పోటీలు జరిగినా నా పేరు ఇచ్చేవాళ్లు. అలా నా పాటల ప్రస్థానం కొనసాగింది. 

మీ కుటుంబంలో పాడేవాళ్లున్నారా? 

మా నాన్న కూడా పాటలు పాడేవాడని ఇంట్లో చెప్పేవారు. ఆయన నా చిన్నతనంలోనే చనిపోవడంతో నాకు నాన్న పాటలు వినే అవకాశం రాలేదు. 

పల్లె నర్సింహ పాటకు ఎన్నేళ్లు అంటే ఏం చెబుతారు? 

నేను దాదాపు ఇరవై ఏండ్ల నుంచి పాడుతున్నా. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సగం జీవితం లో ఈ పాటలే ఉంటాయి. 

బాగా పేరు తెచ్చిన పాట ఏది? 

అవినీతి పాలనలో అలిసే తెలుగుతల్లి/ అందరిని కదలమన్నాది పల్లెలో ఆలోచనా చేయమంది/ ఎర్రజెండాలెత్తమంది మనతల్లి/ పోరు బాటల సాగమంది.. అనే పాట బాగా పేరు తెచ్చింది. దీన్ని కాస్టాళ్ల వెంకన్న రాశాడు. ఈ పాటతతో నాకు గుర్తింపు వచ్చింది. 

ఈ పాటకు నేపథ్యం ఏంటి?

నల్లగొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ సమ స్య గుర్తుకు వస్తది. అందులో దేవరకొండ అంటేనే ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది. అలాంటి చోట ఏళ్లుగా జనం మంచి నీటి కోసం ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. నక్కలగండి ప్రాజెక్టు పూర్తి అయితే ఆ సమస్య పోతుంది. కానీ, పాలకులు దాన్ని పట్టించుకోకపోగా చిన్నోడు.. పెద్దోడు అనే తేడానే లేకుండా అందినకాడికి దోచుకుతింటున్నారు. ఈ నేపథ్యం నుంచి ఈ పాట పుట్టింది. 

స్వరాష్ట్రంలో పాట ఆగమైందని అనిపిస్తుంటుందా?

స్వరాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు అనే అసంతృప్తి ఉంటుంది. ఏ దొరల పాలన, పెత్తందారుల పాలన పోవాలని వేలాదిమంది విద్యార్థులు బలిదానాలు చేశారో అది నెరవేరలేదు.అందుకే ఆ అసంతృప్తిలోంచి అనేక పాటలు పుట్టుకొచ్చాయి. కేసీఆర్ ఉన్న పదేళ్ల కాలంలో ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ పాటలు పాడా. గ్రామాల్లో ప్రచారం చేశా. 

జనం ఎక్కువగా ఏ పాటను అడుగుతుంటారు?

ఎక్కువగా బతుకుదెరువు కోసం పల్లెల నుంచి నగరానికి వస్తువుంటారు. అది నిత్యం జరిగేదే. వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు మా బతుకు గురించి ఏమైనా పాట పాడండి అని అడుగుతుంటారు. అలా అడగటానికి ఓ కారణం ఉంది. పాట వినగానే వాళ్ల సమ స్యలు పరిష్కారం అవుతాయని కాదు కాని కాసింత సాంత్వన చేకురుతుందనే ఉద్దేశంతో అడుగు తుంటారు. ఆ సందర్భం లో నేను పాడే పాట..

‘ఎటుగాని జీతమండి/ 

నేనెట్ల బతుకుడండి/

కాంట్రాక్టు నౌకరండి/ 

కడుపసలే నిండదండి/

సావకుండ, లేవకుండా 

సాగే బతుకుబండి’ 

అనే పాటను పాడుతూ ఉంటా. ఆ పాటలో కాంట్రాక్టు కార్మికుల బతుకు చిత్రం ఉంటుంది. 

కళాకారులు కేవలం ఎంటర్‌టైనర్స్ అనే అపవాదు ఉంది. అది నిజమేనా?

కొన్ని సందర్భాల్లో అది ఉంటుందేమో. కానీ, నేను అటువంటి పరిస్థితిని ఎదుర్కొలేదు. పైగా ఏ కళాకారుడైనా ఒక టి గుర్తుంచుకోవాలి.  మనం పాడుతున్న పాట.. వేస్తున్న నాటకం.. అన్నీంట్లో కూ డా రాజకీయం ఉంటుంది. రాజకీయం లేకుండా ఏ పాట లే దు, ఏ ఆట లేదు. ఒక వక్త గంటసేపు ఉపన్యాసించినా ప్రజల మనసుల్లోకి దూరదు.. మనం పాడుతుంటే పదినిమిషాల్లో ఎక్కుతుంది. అందుకే సాంస్కృతిక విప్లవం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ ఉద్యమంలోనైనా దాన్ని గుర్తించి మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. 

ప్రజల కోసమే పాటైన నర్సింహ జీవితం ఎలా ఉంది? 

ఇప్పటికైతే నేను ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఆనందంగానే ఉన్నా. ఆర్థికంగా పెద్దగా వెనకేసుకోకపోయినప్పటికీ ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తున్నా. 

కళాకారుల కోటాలో పదవి వస్తే తీసుకుంటారా? 

ఎట్టి పరిస్థితిలో తీసుకోను. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పదవి వల్ల మంచి కంటే చెడు ఎక్కువ చేయాల్సి వస్తుంది. గతంలో కళాకారులు.. ప్రభుత్వ పథకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే ప్రచారం చేయాల్సి ఉండేది. ఇప్పుడు నాయకుల గురించి భజన చేయాల్సిన దుస్థితి. 

 రూప