15-06-2025 12:00:00 AM
అవతారమూర్తి సైతం మానవదేహం ధరించి వచ్చినపుడు మూడు గుణాలతోనూ కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తంగా వుంటాడు. ఎంత సర్వజ్ఞుడైనా జగత్తుకు ఏదైనా మహాపరిసత్యం బోధించ తలచినపుడు సాధారణ మానవుడి వలె ప్రవర్తిస్తాడు. శ్రీరాముడు యోగవాశిష్ఠాన్ని శ్రద్ధగా విన్నట్లు, శ్రీకృష్ణుడు విష్ణుసహస్ర నామాన్ని నిష్ఠగా విన్నట్లు, శంకరులూ పరబ్రహ్మ స్వరూపమై కూడా అద్వైతబోధను ఇలాగే అందుకున్నారు. ఆ సందర్భం రమణీయం, మనోహరం, హృదయంగమం. శిష్య సమేతంగా గంగా స్నానానంతరం కదులుతున్న ఆచార్యస్వామి కంటికి, కటికుడొకడు కనిపించాడు, నాలుగు శునకాలతో! జాత్యభిమానం ప్రకటిస్తూ
“తొలుగు తొలుగు” అన్నారు శంకరులు.
“దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమనటం అంటే మీదీ దేహమే. నాదీ దేహమే. రెండూ అన్నమయాలే. రెండూ పంచభూతాలవల్లే ఏర్పడినయ్. ఇక తేడా ఎక్కడున్నది? పోనీ జ్ఞానదృష్టితో చూసినా, ఆత్మ నీయందూ, నాయందూ సాక్షియే కదా! కనుక బ్రాహ్మణ, చండాల అని దేనిని చూస్తున్నారు? సూర్యుడు గంగాజలంపైనా, మురికినీటిపైనా ఏకకాలంలో ప్రతిఫలించటంలేదా? ఆత్మ అంటే అద్వైత భావన కదా? ఇక తొలగవలసిందేది?” అన్నాడు చండాలుడు.
శంకర హృదయాన్ని ఈ ప్రశ్నలన్నీ జ్ఞానకిరణాలవలె తాకినయ్.
“బ్రాహ్మణుడు, చండాలుడన్న భావాన్ని, పావనుడు, పాపి అన్న భేదభావాన్ని, ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని, సమభావాన్ని, సమదృష్టిని ఆచరిస్తాను. మహోదాత్తమైన దివ్యబోధను అందించిన మీరు ఈశ్వరులే. అన్యం కాదు” అంటూనే “అంతేకాదు సర్వసృష్టినీ ఆత్మస్వరూపంగా చూడగలిగినవాడు, నిశ్చితజ్ఞాని అయినవాడు, ఎవరైనా సరే నాకు గురుసమానుడు. సర్వకాలాల నాకు ఆరాధనీయుడే” అన్నారు శంకరులు.
“బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఉన్న చైతన్యమే సర్వ జీవకోటిలోనూ వున్నది. అన్ని కాలాలలో ఈ భావంతో వెలుగుతున్న తత్త్వజ్ఞుడు నాకు పరమ గురువే. నాకు మాత్రమే కాదు జగత్తంతటికీ గురువే” అంటూ భగవత్పాదులు తమ ఎదుట నిలబడి, దర్శనాన్ని అనుగ్రహించింది పరమేశ్వరుడే అనే స్ఫురణను అనుభవించారు.
భేదభావం నశించిన స్థితే మనీష! అది తిరుగులేని, మరువరాని మహాపరిసత్యం. నిశ్చితమైన, స్థిరమైన భావం. భేదం లేకపోవటమే అద్వైతం. భౌతిక స్థితిలో, రెండుగా కనిపించినా, ఆధిభౌతిక స్థితిలో రెండూ ఒకటేనని స్థిరచింతన కలిగినా, ఆధ్మాత్మిక స్థితిలో రెండంటూ లేవని ఉన్నది ఒకటేనని ‘ఎరుక’ కలగటమే’ జ్ఞానలబ్ధి.
సిద్ధత, శుద్ధత, వాటికి వినయమూ తోడైతే, ఆనంద తారక స్థితిని అందుకోవటం ఎంత సులభం! ఆ స్థితిని అనుభవించటం ఎంత సుందరం! ఆ స్థితిలో ఆత్మానందం కలగటం ఎంత శివం! ఆ స్థితిలో సంస్థితం కాగలగటం ఎంత సత్యం! ఒకే స్థితిలో అన్నిటినీ, అన్ని స్థితులలోనూ వాటిని మనీషాయత్తంగా అనుభవించ గలగటం సాధ్యమేనని జ్ఞానమూర్తి శంకరులు నిరూపించారు.