09-12-2025 01:18:08 PM
చర్యలు తీసుకోవాలని సీపీఐ నేతల డిమాండ్
తుర్కయంజాల్: అధిక లోడు, అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు తుర్కయంజాల్లో ఇబ్రహీంపట్నం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుశీల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఆర్టీవో పరిధిలో ఓవర్ లోడింగ్తో భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.
దీని వల్ల రహదారులు పాడు కావడమే కాకుండా, రోడ్లపై కంకరపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేవెళ్లలో కంకర టిప్పర్ బస్సుపై బోల్తా భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని యాదయ్య గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శివకుమార్ గౌడ్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కార్యదర్శి కాటమరాజు తదితరులు పాల్గొన్నారు.