21-02-2026 01:16:39 AM
వేములవాడ, ఫిబ్రవరి 20,(విజయక్రాంతి): పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.శుక్రవారం వేములవాడ పట్టణంలోని 14, 19 వార్డుల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులను అభినందిస్తూ, నూతన గృహాల్లో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హుడికి గౌరవప్రదమైన నివాసం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కీలకంగా మారిందన్నారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పారదర్శకత, నిబద్ధతతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికర రాకేష్, కౌన్సిలర్లు తూము మధు, అన్నారం శ్రీనివాస్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, తోట రాజు, కొండా శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు.