సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..
కొత్తగూడెం,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం మరియు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు కోల్ ఇండియా అనుబంధ బొగ్గు సంస్థలలో యోగా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం రోజున ఉద్యోగులు యోగ ప్రదర్శన చేశారు. ఈ మేరకు సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ దిశానిర్దేశాలతో సంస్థ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో, ఏరియాలోని అన్ని గనులు, విభాగాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించబడినవి.
అదేవిధంగా శనివారం ఉదయం 08.00 గంటలకు రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్ ప్రాంగణంలో భారీ యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing)” అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు జీవన నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యవంతమైన, చురుకైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని యోగా సాధనకు కేటాయించాలని, సురక్షితమైన పని విధానాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలితో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు.






