‘గల్ఫ్’పై కొనసాగిన ఇరాన్ దాడులు
అబుదాబీ/ దుబాయ్, మార్చి 11: ఇరాన్ 11వ రోజు మంగళవారం కూడా గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగించింది. ఖతార్పై 17 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, ఆ దేశం వాటిని నేలమట్టం చేసింది. దాడులకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రాజధాని దోహాలోని బంకర్లలో తలదాచుకున్నారు. దాడుల వల్ల ఖతార్ ఎయిర్వేస్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సౌదీ అరేబియాలోని షైబా చమురు క్షేత్రంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించడం స్థానికంగా అలజడి రేపింది. బహ్రెయిన్లోని పౌర నివాసాలపైనా ఇరాన్ దాడి చేసింది. మనామాలో జరిగిన క్షిపణి దాడిలో ఒక నివాస భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో యువతి మరణించింది. మామీర్ పారిశ్రామిక ప్రాంతంలో వైమానిక దాడుల కారణంగా, ఆ ఆ ప్రాంతమంతా మంటలు అంటుకున్నాయి. అబుదాబి తీరంలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ నావికాదళం హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడంతో నౌకాయానం స్తంభించింది.




