25-06-2025 12:20:31 AM
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’.. అనుపమ పరమేశ్వరన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా పేరిది. ఇందులో మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాస్మోస్ ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ అభ్యంతరం తెలిపిన కారణంగా సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాధితురాలి పాత్రకు జానకి అని దైవ సంబంధమైన పేరును పెట్టారంటూ ముంబయి సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. జానకి.. సీతాదేవికి మరో పేరు అని.. ఆ పేరును అత్యాచార బాధితురాలికి పెట్టకూడదని సెన్సార్ బోర్డు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ ఫేస్బుక్ ద్వారా స్పందిస్తూ జూన్ 27న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడిందని ధ్రువీకరించారు.
ఈ నిర్ణయంపై మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈఎఫ్కేఏ) జనరల్ సెక్రటరీ బీ ఉన్నికృష్ణన్ సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని విమర్శించారు. దేవుళ్ల పేర్లు కలిగిన పాత్రలకు ఇలాంటి నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందని, ఇది కళాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటుందని ఆయన అన్నారు.
ఇలాంటి నిబంధనలు ఉంటే, హిందూ మతానికి చెందిన పాత్రలకు పేర్లు ఎంపిక చేసుకోవడం చాలా కష్టమవుతుందని ఆయన ప్రశ్నించారు. తిరువనంతపురంలోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయం.
ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, ముంబయిలోని ప్రధాన కార్యాలయం ఈ టైటిల్ను మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ సమస్య తలెత్తింది. పేరు మార్చాల్సి వస్తే, సినిమాలోని అనేక సంభాషణలను కూడా మార్చాల్సి వస్తుందని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.