04-02-2026 06:08:02 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గల గేటుకు బిల్లులు చెల్లించడం లేదని జెసిబి యజమాని బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల గేటుకు తాళం వేశారు. ఈ సందర్భంగా జెసిబి యజమాని రామ్మూర్తి మాట్లాడుతూ గత కొంతకాలం క్రితం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో రోడ్డు వెడల్పులో భాగంగా జెసిబితో చేపట్టిన పనులకు సంబంధించిన డబ్బులను అధికారులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు పనులు చేసిన డబ్బుల విషయం అధికారులు అడిగిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జెసిబి కిస్తీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీదికి వచ్చి గొడవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ ను మీడియా వివరణ కోరగా మున్సిపల్ ఎన్నికల తర్వాత డబ్బులు చెల్లిస్తామని చెప్పడం జరిగిందన్నారు. చెప్పిన వినకుండా గేటుకు తాళం వేయడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ రమేష్ తెలిపారు.