ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..
రూపాయలు 8. 80 లక్షలు టోకరా
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
శివంపేట,(విజయక్రాంతి): ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.8.80 లక్షల నగదు,ఒక హెచ్పీ ల్యాప్టాప్ తీసుకుని మోసం చేశారంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.శివంపేట మండల పరిధిలోని భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాకు చెందిన మాలోత్ సంతోష్ తండ్రి వసంతరావు సర్కిల్ ఇన్స్పెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం. గత మార్చి 2025లో తనకు పరిచయమైన చౌహాన్ సునీల్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.అదే హామీతో బీటెక్ చదువుతున్న నవీన్కు కూడా ఉద్యోగం కల్పిస్తానని చెప్పి ఇద్దరి నుంచి విడతల వారీగా నగదు,
ఆన్లైన్ బదిలీల రూపంలో మొత్తం రూ.8.80 లక్షలు,ఒక హెచ్పీ ల్యాప్టాప్ తీసుకున్నట్లు పేర్కొన్నాడు.అయితే ఇప్పటి వరకు ఉద్యోగం కల్పించకపోగా,డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఫిర్యాదులో ఆరోపించాడు.అనంతరం సంబంధిత సంస్థ గురించి విచారించగా,అక్కడ సునీల్ అనే వ్యక్తి లేడని తెలిసిందని తెలిపాడు.తనను,నవీన్ను ఉద్యోగం పేరుతో మోసం చేసిన చౌహాన్ సునీల్ కంసారాసింగ్ నాయక్,అతని తండ్రి లక్ష్మాసింగ్ నాయక్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని,తమ నుంచి తీసుకున్న నగదు,ల్యాప్టాప్ను తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు.ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం.






