‘కోచ్’లో స్థానికులకే కొలువులు ఇవ్వాలి
కాజీపేటలో డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి
కాజీపేట, జులై 19 (విజయక్రాంతి): కాజీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేట ను రైల్వే డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మడికొండ నుండి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. జే ఏ సీ అధ్యక్షులు కొండ్ర నర్సింగ్ రావు, దేవులపల్లి రాఘవేందర్, సందెల విజయ్ కుమార్, సిపిఎం నేత చుక్కయ్య మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతవాసులు పోరాడి సాధించుకున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు, భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు చూపాలని డిమాండ్ చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైనప్పటికీ రైల్వే శాఖ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదని, వెంటనే ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. వివిధ ఏజెన్సీలకు అప్పజెప్పే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖకు లాభాలను ఇస్తున్న కాజీపేట రైల్వే సబ్ డివిజన్ ను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.






