కడియం, తెల్లంను అనర్హులుగా ప్రకటించాలి

25-04-2024 02:21:36 AM

n బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘం, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలను చేర్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కాదన్నారు.

వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తే అనుమతించలేదని తెలిపారు. దీంతో ఈ నెల 10న రిజిస్టర్ పోస్టు, అధికారిక ఈ మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించామన్నారు. ఆ అడ్రస్‌లో ఎవరూ లేరంటూ రిజిస్టర్ పోస్టు తిరిగి వచ్చిందని వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్ మా వినతిని తిరస్కరిస్తున్నారని, ఈ మెయిల్ ద్వారా పంపిన వినతిపత్రాలను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.