నియోజకవర్గంలో అభివృద్ధి పనులే ఏకైక లక్ష్యం
హనుమకొండ,(విజయక్రాంతి): స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణమవుతున్న బంజారా భవన్, 100పడకల అస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి, శంకుస్థాపన శిలాఫలకాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాలకు రూ.77 కోట్లతో పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 20 తండాలకు 38 కిలోమీటర్ల మేర బీటి వేయించినట్లు ఆయన వెల్లడించారు.
సుమారు 17 వేల ఓట్ల జనాభా ఉన్న గిరిజనులకు నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ ఉండాలనే ఉద్దేశ్యంతో భవన నిర్మాణానికి రూ.2 కోట్ల మంజూరు తీసుకువచ్చనన్నారు. నూతన గ్రామపంచాయతీలు అయిన 8 గిరిజన తండాలకు రూ.1 కోటి 60 లక్షలు మంజూరయ్యాయని, అలాగే నియోజకవర్గ కేంద్రంలో 63 లక్షలతో ఎస్టీ హాస్టల్ భవన నిర్మాణ పనులు చేసుకున్నామని త్వరలోనే ప్రారంభించుకొనున్నట్లు తెలిపారు. బంజారా భవన్ వద్ద లేవలింగ్, డైనింగ్ హల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తండాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని వివరించారు. అతి త్వరలోనే స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మారబోతున్నాయని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 70కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు, వాటికీ వీలైనంత మంజూరు తీసుకువచ్చి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 26కోట్లతో డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం, 100పడకల అస్పత్రి నిర్మాణం, డిగ్రీ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వంటి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయిన కొంత మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదని కానీ అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు.
నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని అన్నారు. ఎవరెన్ని అసత్య ఆరోపణలు చేసిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళ్తున్నానని, నియోజకవర్గ ప్రజలు సగర్వాంగ తల ఎత్తుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






