12-05-2025 02:47:21 AM
బేకరీ పేరు మార్చాలంటూ
బీజేపీ నేతల నిరసన
పాకిస్థాన్ ఆనవాళ్లు ఉండొద్దంటూ నినాదాలు ’కరాచీ’ పేరును కవర్లతో కప్పేసిన బేకరీ యాజమాన్యం
రాజేంద్రనగర్, మే 11: శంషాబాద్లోని కరాచీ బేకరీపై స్థానికులు, బీజేపీ నాయకులు దాడి చేశారు. నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. వెంటనే బేకరీ పేరును మార్చాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఆనవాళ్లు ఏమాత్రం ఉండకూడదని, పాకిస్తాన్ లోని సిటీ పేరు అయిన కరాచీని తొలగించాలని డిమాండ్ చేశారు. బార్డర్లో దేశం కోసం సైనికులు పోరాడుతుంటే శత్రు దేశానికి సంబంధించిన పేరును బేకరీకి ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.
పాకిస్తాన్ ముర్దాబాద్.. హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బేకరీకి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రేపటిలోపు బోర్డును తొలగింపజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బేకరీ పేరు మార్చకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ తర్వాత బేకరీ యాజమాన్యం నేమ్బోర్డును నల్లటి కవర్లతో కప్పేశారు. అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్న కరాచీ బేకరీల పేర్లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.