12-06-2025 09:54:26 AM
హైదరాబాద్: నారాయణపేట జిల్లాలోని నర్సిరెడ్డిపల్లి- జక్లర్ గ్రామాల(Narsi Reddy Palli-Jakhar village) మధ్య జాతీయ రహదారి 167పై గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టిన ప్రమాదంలో కనీసం 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కర్ణాటకలోని శివమొగ్గ నుండి హైదరాబాద్ కు 29 మంది ప్రయాణికులతో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఢీకొన్న కారణంగా బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని పోలీసులు తెలిపారు. వేగంగా వెళ్తున్న బస్సు అదే దిశలో వెళ్తున్న ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గాయపడిన వారందరికీ మొదట మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Makthal Government Hospital) ప్రథమ చికిత్స అందించి, తరువాత తదుపరి చికిత్స కోసం రాయచూర్, మహబూబ్ నగర్ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.