07-06-2025 01:35:47 AM
యాదాద్రి భువనగిరి జూన్ 6 (విజయక్రాంతి) : ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పేద ప్రజలు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా చేస్తానని, జపాన్, సింగపూర్ సరసన రాష్ట్రాన్ని నిలుపుతానని అన్నారు. శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలో రూ.౧౫౦౦ కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితులలో గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్నారు. ‘యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మర్చాం. కొండపై భక్తులు నిద్రించేలా.. ఆటోలు నడిచేలా చేస్తాం. ౬౦ కిలోల బంగారంతో ఆలయ గోపురం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.
టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ ఏర్పాటు చేసాం. యాదగిరిగుట్టలోని విద్యా సంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తాం. ఎవరు అడ్డం పడినా సరే.. మూసీ ప్రక్షాళన చేసి నల్లగొండ రైతులను ఆదుకొంటాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం. సబర్మతి, గంగా నదుల ప్రక్షాళన చేసుకోవచ్చు.. మూసీ నదిని మాత్రం ప్రక్షాళన చేయకూడదా’ అని సీఎం ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్..
‘బంగారు తెలంగాణ ముసుగులో రాష్ట్రాన్ని బొందలగడ్డ చేసారు. పదేళ్లు దోచుకున్న వాళ్లా నన్ను ప్రశ్నించేది. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, ఫాంహౌస్ కోసం ఆ గ్రామాన్ని ధ్వంసం చేసారు. రూ. ౮ లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసారు. ఇన్స్టాల్మెంట్స్లో జీతాలు చెల్లించిన వాళ్లే ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు. పేదలను, రైతులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట వద్ద అపచారానికి మూల్యం చెల్లించుకున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవు బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకురాలే చెప్పారు. సొంత బిడ్డకు జవాబు ఇవ్వలేక దెయ్యాల నేత ఫాంహౌస్లో పడుకున్నారు. ఆ పార్టీ పేరు బీఆర్ఎస్ కాదు, డీఆర్ఎస్.. దెయ్యాల రాష్ట్ర సమితి కొరివి దెయ్యాలను తరిమికొట్టేందుకు కార్యకర్తల సహకారం కావాలి’ అని రేవంత్రెడ్డి అన్నారు.
తను జైళ్లోనుంచి బయటికి వచ్చినప్పుడే అప్పటి ప్రభుత్వాన్ని పడగొడుతానని తొడగొట్టి చెప్పానని, తొడగొట్టా.. పడగొట్టానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కావాలనే తన లక్ష్యం నెరవేరిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుచేసే లక్ష్యంతో పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. కమిషన్ నోటీసులు తీసుకుంటేనే అంత బాధ అవుతున్నదని, నెలల తరబడి జైలు జీవితం గడిపిన తమకు ఎంత బాధకలగాలని సీఎం రేవంత్రెడ్డి మాజీ సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు.
దేశంలో వందేళ్లలో ఎవరుచేయని విధంగా మొదటిసారి కులగణను చేపట్టి రాష్ట్రంలో 56.36% బలహీనవర్గాలు ఉన్నారని లెక్కలు తీశామన్నారు. విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, 600 బస్సులను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇచ్చి, వారు వ్యాపార రంగంలో రాణించే విధంగా చేశామని, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, పాఠశాల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నివర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా 100 నియోజకవర్గాలలో 20వేల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు.
ఆరు నూరైన మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి నది జలాలతో మూసీని నింపుతామని తెలిపారు. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎస్ఎల్బీసీకి, డిండికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పూర్తి చేయలేదు? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు మాదిరిగా ఆరుసార్లు విజయం సాధించి ప్రజాసేవలో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శంకుస్థాపనలు..
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 574.56 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 183 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒకటో వార్డు నుండి 12వ వార్డులలో 25.5 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, బిటి రోడ్లు ,స్ట్రాం వాటర్ డ్రైనేజీ పనులకు పనులకు, 7.50 కోట్ల రూపాయల వ్యయంతో కొలనుపాకలో చేపట్టనున్న హెచ్ఎల్బి నిర్మాణ పనులకు, 6కోట్ల రూపాయల వ్యయంతో కల్వలలో చేపట్టే హెచ్ఎల్బి నిర్మాణ పనులకు, మోట కొండూరు మండల కేంద్రంలో 8.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తహసిల్దార్, ఎంపీడీవో, పోలీస్స్టేషన్ భవనాల నిర్మాణానికి యాదగిరి గుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలో 22.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు , 21.14కోట్ల రూపాయల వ్యయంతో ఆలేరు నియోజక వర్గంలో సిఆర్ఆర్, ఎం ఆర్ఆర్ పనులతో చేపట్టే బిటి రోడ్ల పనులకు, ఆలేరు మార్కెట్ యార్డులో 2.75 కోట్లు రూపాయల వ్యయంతో చేపట్టనున్న 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముగ్గురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు 54 కోట్ల 70 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ,మందుల సామెల్,ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా ఆమిథ్ రెడ్డి, పర్యటక్ శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిసిపి ఆకాన్స్ యాదవ్, తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
ఆలేరులో మిషన్ భగీరథ..
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేద ప్రజలకు అం డగా ఉంటుందని, సన్న బియ్యంతో పేదవాడికి రెండు పూటలా అన్నం పెడుతున్నామని, ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ఇవ్వని వాటిని కూడా నెరవేరుస్తున్నామని, ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వనున్నమని, యాదగిరిగుట్ట మున్సి పాలిటీలో తాగునీటితో పాటు ఇండ్లు, డ్రైనేజీలు అన్ని కట్టిస్తామని తెలిపారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చేస్తున్న పథకాలను వివరించారు.
ఇండస్ట్రియల్ పార్కు కావాలి..
సభకు అధ్యక్షత వహించిన ఆలే రు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఏఎంఆర్పి కింద మిగి లిపోయిన 10 కిలోమీటర్ల ఉప కాలు వ పనులకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని, తుర్కపల్లి మండలానికి ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని, గుండాల కాల్వపనులకు నిధులు మంజూరు చేయాలని, బొ మ్మలరామారంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని, కష్టాల్లో ఉన్న మదర్ డైరీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గంధమల్లను పూర్తిచేస్తాం
సన్న బియ్యంపై 11,000 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న గంధమల్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను 574 కోట్లతో చేపట్టి పూర్తి చేయనున్నామని, రిజర్వాయర్లో ఎక్కువ గ్రామాలు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూపొందించడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులతో పాటు, కృష్ణా నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రజెక్టులను చేపట్టలేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునియదిగానీ కాలువ అన్నింటిని పూర్తి చేస్తామని, అయితే లిఫ్ట్ ఇరిగేషన్ల కింద భూసేకరణను పూర్తిచేసే బాధ్యతను సంబంధిత శాసనసభ్యులు తీసుకోవాలన్నారు..
గత ప్రభుత్వం డిండికి ఎక్కడినుండి నీరు తీసుకోవాలో గుర్తించలేకపోయిందని, అలాంటిది తాము 1800 కోట్ల రూపాయలతో ఎదుల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్నమని, తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు.